తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ‘భైంసా’ పేరును ‘మైసా’గా పేరు మారుస్తామని, అలాగే పట్టణాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు ఆయన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 5వ విడత పాదయాత్ర సందర్భంగా మంగళవారం భైంసా సమీపంలో ఏర్పాటు చేసిన ప్రారంభ బహిరంగ సభలో ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, అయితే తర్వాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భైంసాను మైసా (మహిషా)గా పేరు మారుస్తామని స్పష్టం చేసిన ఆయన, భైంసా అల్లర్లలో గాయపడిన బాధితులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని, వారిపై పెట్టిన కేసులను ఎత్తేస్తామని, అలాగే వారికి ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేర్చారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటేనని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, పార్టీ అధికారంలోకి వచ్చాక పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, ప్రజలకు వైద్యం అందిస్తామని, అలాగే గూడు లేని వారికి పక్కా ఇళ్లు కట్టిస్తామని ఆయన ప్రకటించారు. ఇక రాష్ట్రంలోని రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, వారిని ఆదుకోవడం ప్రభుత్వ కనీస బాధ్యత అని, అందుకే తాము పంట నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం అందిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కీలక నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE