ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 27, సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో కోల్కతా, ముంబయి మరియు నోయిడాలో ఏర్పాటైన అత్యాధునిక సౌకర్యాలు కలిగిన కరోనా పరీక్షా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఎం మోదీ మాట్లాడుతూ, ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఈ కొత్త హైటెక్ కరోనా పరీక్షా కేంద్రాల ద్వారా ఈ మూడు నగరాల్లో ప్రతిరోజూ అదనంగా మరో 10,000 పరీక్షలు చేసే సామర్ధ్యం పెరిగిందని అన్నారు. ఈ ల్యాబ్స్ లో కేవలం కరోనా పరీక్షలే కాకుండా హెపటైటిస్ బి మరియు సి, హెచ్ఐవి, డెంగ్యూ, అనేక ఇతర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించవచ్చని చెప్పారు.
కరోనాపై పోరాటంలో భాగంగా నిర్దిష్టమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడం దేశానికి అత్యవసరం అని పీఎం మోదీ అన్నారు. అందుకోసం ముందుగానే కేంద్రం 15 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించినట్లు పీఎం గుర్తు చేశారు. దేశంలో ఇప్పుడు 11,000 కన్నా ఎక్కువ కరోనా కేంద్రాలు, 11 లక్షలకు పైగా ఐసోలేషన్ పడకలు ఉన్నాయని చెప్పారు. జనవరిలో దేశంలో ఒకే కరోనా పరీక్షా కేంద్రం ఉండగా, ఇప్పుడు దాదాపు 1300 ల్యాబ్లు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం దేశంలో రోజూ 5 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, రాబోయే వారాల్లో ఈ సామర్థ్యాన్ని 10 లక్షలకు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని పీఎం మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu