ఇప్పటివరకు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ‘మంకీపాక్స్’ వైరస్ తాజాగా భారత్లో వెలుగుచూసింది. ఈ మేరకు తొలికేసు కేరళలో నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ ధ్రువీకరించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి తిరిగి వచ్చిన కేరళకు ఒక వ్యక్తికి మంకీపాక్స్ వ్యాధి సోకినట్లు గురువారం నిర్ధారించబడింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి వైద్య బృందాన్ని కేరళకు పంపించింది. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్లాంకు చెందిన చెందిన 35 సంవత్సరాల వ్యక్తిలో ఇది కనుగొనబడినట్లు కేంద్ర అధికార వర్గాలు ధృవీకరించాయి.
తొలుత ఆ వ్యక్తిలో మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో పరీక్షల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా నిన్న పాజిటివ్గా తేలింది. దీంతో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం సమాచారాన్ని కేంద్రానికి చేరవేయడంతో పాటు ఆ వ్యక్తిని ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా మంకీపాక్స్ వైరస్ అనేది మశూచికి కారణమయ్యే వైరస్ల సమూహానికి చెందినది. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. జ్వరం, విరేచనాలు, శరీరం, ముఖంపై దద్దుర్లు వంటి తీవ్ర లక్షణాలు ఒక నెల వరకు ప్రభావం చూపిస్తాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 59 దేశాల్లో 6వేల మందికిపైగా మంకీపాక్స్ సోకింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ