నేటినుంచి (మే 22, సోమవారం, 2023) జమ్మూ,కాశ్మీర్ లోని శ్రీనగర్లో మే 24 వరకు జీ20 సభ్యుల టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం జరుగనుంది. ఈ క్రమంలో జీ20 దేశాలకు చెందిన సుమారు 60 మంది ప్రతినిధులు శ్రీనగర్కు రానున్నారు. అయితే సమావేశాలు నిర్వహించే శ్రీనగర్ వివాదాస్పద ప్రాంతం అని పేర్కొంటూ ఈ మీటింగ్లో పాల్గొనబోమని డ్రాగన్ దేశం చైనా ప్రకటించింది. ఈ మేరకు ఆ సమావేశాలకు హాజరుకావడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వాంగ్ వెన్బిన్ తెలిపారు. వివాదాస్పద భూభాగంలో ఎలాంటి జీ20 సమావేశాలను నిర్వహించడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తోందని, ఇతర దేశాలలో ఉద్రిక్తతలు పెంచడానికి ఆస్కారమున్న అలాంటి సమావేశాలకు హాజరుకావాలని భావించడం లేదని వాంగ్ వెన్బిన్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో చైనా చేస్తున్న వాదనలకు ఇండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. స్వంత భూభాగంలో యథేచ్చగా మీటింగ్లు నిర్వహించుకుంటామని ఇండియా ప్రకటించింది. చైనాతో సంబంధాలు సజావుగా ఉండాలంటే, సరిహద్దు వద్ద శాంతి, సామరస్యం ముఖ్యమని భారత్ స్పష్టం చేసింది. ఈ ఏడాది జీ20 అధ్యక్ష బాధ్యతలు అందుకున్న భారత్, సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి ముందు దేశవ్యాప్తంగా అనేక సమావేశాలను నిర్వహిస్తోంది. కాగా ఈ సమావేశాల నేపథ్యంలో భారత్ భారీ రక్షణ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా శ్రీనగర్లో మెరైన్ కమాండోలు, ఎన్ఎస్జీ గార్డులు పహారా కాస్తున్నారు. సమీపంలోని దాల్ సరస్సులో ఎన్ఎస్జీ కమాండోలు స్థానిక పోలీసులు, పారామిలిటరీ దళాలు చెకింగ్ నిర్వహిస్తున్నారు. హౌజ్బోట్లలో మెరైన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.
ఇదిలా ఉండగా మరోవైపు వివాదాస్పదమైన ముస్లిం మెజారిటీ కాశ్మీర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై చైనాతో పాటు పాకిస్తాన్ కూడా భారతదేశాన్ని తప్పుబట్టింది. న్యూఢిల్లీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర స్థితిని మార్చి, ప్రత్యేక హోదాను రద్దు చేసి, సమాఖ్య భూభాగంగా మార్చిన 2019 నుండి భారత్-పాకిస్తాన్ సంబంధాలు స్తంభించాయి. జమ్మూ, కాశ్మీర్ మరియు లడఖ్ అనే రెండు సమాఖ్య భూభాగాలకు సంబంధించి ఎప్పటినుంచో పాకిస్తాన్, చైనాలు ఇండియాతో విభేదిస్తున్నాయి. లడఖ్లోని పెద్ద భాగం చైనా ఆధీనంలో ఉంది. 2020లో లడఖ్లో జరిగిన సైనిక ఘర్షణలో 24 మంది సైనికులు మరణించినప్పటి నుండి న్యూఢిల్లీ మరియు బీజింగ్ మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. ఇక వివిధ కారణాలతో ఈ సమావేశాలకు టర్కీ హాజరుకావడంలేదు. అలాగే ఈ ఈవెంట్కు సౌదీ అరేబియా ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE