ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022/15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 26న వాంఖడే స్టేడియంలో 2021 ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్, రన్నర్స్-అప్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ తో క్రీడాభిమానులకు అత్యంత ఇష్టమైన ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించే విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి కారణంగా వచ్చిన విరామం తర్వాత తిరిగి ఐపీఎల్ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 15వ సీజన్ లో కోవిడ్-19 ప్రోటోకాల్ అనుసరించి 25 శాతం ఆక్యుపెన్సీతో ముంబయి, నేవీ ముంబయి, పూణేలోని స్టేడియంలలో మ్యాచులు నిర్వహించబడతాయని తెలిపారు.
అభిమానులను తిరిగి స్టేడియంలకు స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ లో తమ అభిమాన ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ, ఉత్కంఠ రేపే మ్యాచులకు చూసేందుకు క్రికెట్ అభిమానులు సిద్ధంగా ఉన్నారన్నారు. అభిమానులు ఐపీఎల్ అధికారిక వెబ్సైట్ మరియు బుక్ మై షో వెబ్సైట్ లలో ఐపీఎల్ లీగ్ దశ కోసం మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి టిక్కెట్ లను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ ఐపీఎల్ 15వ సీజన్ లో 65 రోజుల వ్యవధిలో మొత్తం 70 లీగ్ మ్యాచ్లు మరియు 4 ప్లేఆఫ్ గేమ్స్ జరగనున్నాయి. అలాగే ఈసారి ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు పూర్తిగా మహారాష్ట్ర రాష్ట్రంలోనే జరగనున్నాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో 20, నావీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో 20, బ్రబౌర్న్ స్టేడియంలో 15, మరియు పూణే గహుంజేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) గ్రౌండ్లో 15 మ్యాచులు నిర్వహించనున్నారు. మే 22తో లీగ్ మ్యాచ్లు ముగియనుండగా, మే 29న జరగబోయే ఫైనల్, మరియు ప్లేఆఫ్ ల షెడ్యూల్ తర్వాత ప్రకటించబడుతుందని బీసీసీఐ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ