ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 భాగంగా ఏప్రిల్ 22, శుక్రవారం రాత్రి ముంబయి వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, ప్రవీణ్ ఆమ్రేలకు జరిమానా విధించారు. ఈ మేరకు ఐపీఎల్ టోర్నీ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.7 ప్రకారం పంత్ లెవల్ 2 నేరాన్ని అంగీకరించాడని మరియు చర్యలను ఆమోదించాడని తెలిపారు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించబడిందని, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం శార్దూల్ ఠాకూర్ లెవల్ 2 నేరాన్ని ఒప్పుకుని, తీసుకుంటున్న చర్యలకు అంగీకరించాడని తెలిపారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేకు అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించబడింది. అలాగే అతను ఒక మ్యాచ్ నిషేధాన్ని కూడా ఎదుర్కోనున్నాడని తెలిపారు.
ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో నోబాల్ వివాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి ఢిల్లీ ముందు 223 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్షఛేదనలో దూకుడుగా ఆడిన ఢిల్లీ విజయం కోసం చివరి ఓవర్లో 36 పరుగులు చేయాల్సి వచ్చింది. ఢిల్లీ బ్యాటర్ రోమన్ పావెల్ చివరి ఓవర్ లో మొదటి మూడు బంతులను సిక్సర్లుగా మలచడంతో ఢిల్లీకి కొంతమేర విజయావకాశాలు ఏర్పడ్డాయి. అయితే మూడో బంతి నోబాల్ లా కనిపించడంతో ఢిల్లీ ఆటగాళ్ళు అభ్యంతరం తెలిపినా అంపైర్లు పట్టించుకోలేదు. ఈ నోబాల్ వ్యవహారంపై అంపైర్లు స్పందన, థర్డ్ అంపైర్ కూడా కలుగజేసుకోకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అసంతృప్తికి గురై తమ ఆటగాళ్లను మైదానం నుంచి వెనక్కి రమ్మని సైగలు చేశాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే మైదానంలోకి వెళ్లి నోబాల్ పై అంపైర్లుతో చర్చించాడు. మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఆసక్తికర పరిణామాలన్నీ పెను దుమారం రేపాయి. ఈ విషయంలో ఢిల్లీ జట్టు వ్యవహరించిన తీరును పలువురు క్రికెటర్లు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘన కింద ఈ వివాదంలో ప్రమేయమున్న రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, ప్రవీణ్ ఆమ్రేలకు జరిమానా విధిస్తూ ఐపీఎల్ టోర్నీ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ