దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా జేఈఈ మెయిన్-2021 ఏప్రిల్ సెషన్ పరీక్షను కూడా వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ముందుగా 2021 సంవత్సరానికి సంబంధించి దేశంలో ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగు సెషన్లలో నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఫిబ్రవరి సెషన్, మార్చి సెషన్ పరీక్షలను నిర్వహించారు. కాగా జేఈఈ మెయిన్-2021 ఏప్రిల్ సెషన్ పరీక్షలు ఏప్రిల్ 27, 28, 30 తేదీల్లో జరగాల్సి ఉండగా, కరోనా పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్టు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆదివారం నాడు ప్రకటించింది.
ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలు తర్వాత ప్రకటించబడతాయని, అయితే కనీసం 15 రోజుల ముందు అభ్యర్థులకు వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. అలాగే అభ్యర్థులు ఈ సమయాన్ని ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోవాలని, ఎన్టీఏ అభ్యాస్ యాప్ ద్వారా ఇంటి వద్దే ఉండి ఫుల్ లెన్త్ లేదా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ