గాన గంధర్వుడు, ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ మరియు ఎక్మో సపోర్ట్ తో చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుని తిరిగి వస్తారని భావించిన సన్నిహితులకు, సినీ ప్రముఖులకు, అభిమానులకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తీవ్ర దిగ్భ్రాంతి ని కలిగించింది. ఎస్పీ బాలు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు.
ఎస్పీ బాలు జూన్ 4, 1946 న నెల్లూరులో జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. చిన్నతనం నుంచే సంగీతం, పాటలు పాడడం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. చదువుకునే సమయంలోనే పాటల పోటీలలో ఎస్పీ బాలు ఎన్నో అవార్డ్స్ గెలుపొందారు. ఈ క్రమంలో 1966 లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో తొలిసారిగా పాట పాడి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్లేబ్యాక్ సింగర్ గా, సంగీత దర్శకుడుగా, నటుడుగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మరియు సినీ నిర్మాత గా సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం సహా మొత్తం 16 భారతీయ భాషలలో 40,000 పాటల పాడారు. 40,000 పైగా పాటలతో అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా ఎస్పీ బాలు తన పేరుపై గిన్నిస్ రికార్డును కలిగి ఉన్నారు. శంకరాభరణం, సాగరసంగమం లాంటి చిత్రాల్లో ఎస్పీ బాలు పాడిన పాటలు అభిమానుల్ని ఉర్రూతలూగించాయి.
ఎస్పీ బాలు తన కెరీర్ లో 6 నేషనల్ అవార్డ్స్ , 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, 25 నంది అవార్డ్స్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అనేక అవార్డులు అందుకున్నారు. భారతీయ సినిమాకు చేసిన కృషికి గానూ ఎన్టీఆర్ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భారత ప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ, 2011 లో పద్మ భూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను కూడా అందుకున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu