మహారాష్ట్రలో అధికార ”మహా వికాస్ అఘాడీ’ (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్) కూటమికి షాక్ తగిలింది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వంలోని సొంత మంత్రి రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు మరో 11 మంది శివసేన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమైనట్లు తెలుస్తోంది. బిజెపి పాలిత గుజరాత్లోని సూరత్ జిల్లాలో గల ఒక విలాసవంతమైన హోటల్లో షిండే ఆధ్వర్యంలో 11 మంది శాసనసభ్యులతో క్యాంప్ ఏర్పాటు చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. సూరత్లోని ది గ్రాండ్ భగవతి” హోటల్లోకి ఎమ్మెల్యేలు విడిది చేసినట్లు సమాచారం.
కాగా నిన్న మహారాష్ట్ర శాసనమండలిలో 10 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. అనూహ్యంగా బీజేపీ అత్యధికంగా 5 స్థానాలను దక్కించుకోవడంతో మహా సర్కార్ షాక్ తింది. 4 స్థానాలే గెలవగలిగే బీజేపీ ఆశ్చర్యకరంగా 5వ స్థానాన్ని కూడా దక్కించుకోవడంతో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అర్ధమయింది. దీంతో ఈ అంశంపై తేల్చేందుకు శివసేన పార్టీ తన ఎమ్మెల్యేలందరినీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం ‘వర్ష’లో సమావేశమవ్వాల్సిందిగా ఆదేశించింది. అయితే ఈ సమావేశానికి మంత్రి ఏక్నాథ్ షిండేతో పాటుగా మరో 11 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదని గుర్తించారు. వారికి ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదని శివసేన వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారని సమాచారం అందుకున్న పార్టీ అధిష్ఠానం వెంటనే అందరినీ ఢిల్లీకి రావాలని ఆదేశించింది. కాగా తాజా పరిణామాలతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల ఉమ్మడి ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈరోజు మధ్యాహ్నం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవహారం అంతా బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యూహం ప్రకారమే జరుగుతోందని అధికార పక్షం విమర్శలు చేస్తోంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ప్రస్తుత పరిణామాలపై కేంద్రంలోని పెద్దలతో చర్చించనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. మరి కొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY