మహారాష్ట్ర రాష్ట్రంలో నెలకున్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవీకి, ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేస్తున్నట్టుగా బుధవారం రాత్రి శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. “ఎవరైనా అదృష్టాన్ని తన వ్యక్తిగత విజయంగా తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, వారికి పతనం వైపు ప్రయాణం ప్రారంభమవుతుంది” అని రాజ్ థాకరే ట్వీట్ చేశారు.
ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సీఎం పదవీకి రాజీనామా చేసిన ఉద్ధవ్ థాకరే ను ఉద్దేశించినట్లుగానే ఈ ట్వీట్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా దాదాపు రెండు దశాబ్దాల క్రితమే రాజ్ థాకరే శివసేనలో తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అనంతరం శివసేన నుంచి వేరుపడి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అనే పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన మొదట్లో రాజ్ థాకరే కొంతమేర ప్రభావం చూపగల్గినప్పటికీ, అనంతరం అంతగా విజయాన్ని దక్కించుకోలేక పోయారు.
మరోవైపు మహారాష్ట్రలో తదుపరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే గురువారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఏక్నాథ్ షిండే వర్గం మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ముందుగా ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు అనంతరం శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వానికి గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆదేశాలు ఇచ్చారు. గవర్నర్ ఆదేశాలపై శివసేన సుప్రీం కోర్టును ఆశ్రయించగా, స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలోనే బలపరీక్షకు ముందుగానే సీఎం పదవీకి ఉద్ధవ్ థాకరే రాజీనామా చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY