మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. అందరూ అనుకుంటున్నట్లు బీజేపీ కాకుండా ముఖ్యమంత్రి పదవి శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అధిష్టించేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ మేరకు గురువారం రాత్రి 7:30కి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని, అందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కోష్యారికి విజ్ఞప్తి చేశారు. దీనికి సమ్మతించిన గవర్నర్, షిండేను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. కాగా నిన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనూహ్యంగా సీఎం పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ క్రమంలో ఏక్నాథ్ షిండే తన వర్గ ఎమ్మెల్యేలతో ఈరోజు మధ్యాహ్నం ముంబై చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా బీజేపీ నేత ఫడ్నవీస్ ను కలిశారు. కొద్దిసేపటి తర్వాత వీరిద్దరూ గవర్నర్ కోష్యారిని కలిసి ప్రభుత్వ ఏర్పాటు విషయమై చర్చించారు. అనంతరం వారిరువురూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ.. హిందుత్వ, సావార్కర్ విధానాలకు వ్యతిరేకంగా శివసేన కూటమి ఏర్పాటు చేసిందని, మహారాష్ట్ర ప్రజల తీర్పును ఆ పార్టీ అవమానించిందని ఆరోపించారు. షిండే ప్రమాణ స్వీకారం అనంతరం క్యాబినెట్ను ఏర్పాటు చేస్తామని, దీనిలో బీజేపీ, శివసేనకు చెందిన నేతలు ఉండనున్నారని ప్రకటించారు. అయితే తాను మాత్రం ప్రభుత్వంలో ఉండడం లేదని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ