దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, పలు రాష్ట్రాల్లో నిర్వహించే ప్రవేశ పరీక్షలు వాయిదా పడుతున్నాయి. విద్యార్థుల భద్రతా దృష్ట్యా నీట్, జేఈఈ పరీక్షలు కూడా మరోసారి వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం హెఛ్ఆర్డీ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. అలాగే నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణకు కొత్త తేదీలను ప్రకటించారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 6 తేదీ వరకు, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను సెప్టెంబర్ 27న నిర్వహించనున్నట్టు చెప్పారు. అదేవిధంగా నీట్ పరీక్షను సెప్టెంబర్ 13 న నిర్వహించనున్నట్టు తెలిపారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్, పాలీసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్సెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అలాగే జూలై 4,11,12 వ తేదీలలో జరగాల్సిన టైప్ రైటింట్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఇక చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) జూలై 3, శుక్రవారం నాడు ప్రకటించింది. మే మరియు నవంబర్ సెషన్ లకు సంబంధించిన పరీక్షలను సంయుక్తంగా నవంబర్ నెలలో నిర్వహించనున్నట్టు ఐసీఏఐ ప్రకటించింది. ముందుగా సీఏ పరీక్ష మే 3 న జరగాల్సి ఉండగా కోవిడ్ -19 లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అనంతరం జూలై 29 నుంచి ఆగస్టు 16 తేదీల మధ్యలో పరీక్షలు నిర్వహించాలని ఐసీఏఐ ప్రణాళిక రూపొందించగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరోసారి వాయిదా పడ్డాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu