టోక్యో ఒలింపిక్స్-2020 లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కాంస్య పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 2016 రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన పీవీ సింధు, టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సొంతం చేసుకుని వరుసగా రెండు ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకాలు సాధించిన తోలి భారతీయ క్రీడాకారిణిగా సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా మంగళవారం పీవీ సింధుకు స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆమెకు ఘన స్వాగతం లభించింది. పీవీ సింధు మరియు ఆమె కోచ్ పార్క్ టే-సాంగ్ కు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులతో పాటుగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా స్వాగతం పలికారు.
అనంతరం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీవీ సింధును కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాగూర్, జి. కిషన్ రెడ్డి మరియు నిర్మలా సీతారామన్ ఘనంగా సన్మానించారు. ఒలింపిక్స్ లో వరుసగా రెండవ పతకం గెలుచుకున్న సింధుపై మంత్రులు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మరియు స్పోర్ట్స్ అథారిటీకి ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్ధతు తెలిపిన దేశంలోని కోట్లాది మంది ప్రజలకు పతాకాన్ని అంకితం చేస్తునట్టు చెప్పారు. అలాగే తన తల్లిదండ్రులు ప్రోత్సాహం, వారు చేసిన ప్రయత్నాలు, త్యాగాలకు పీవీ సింధు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకు నగదు ప్రోత్సాహకం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రస్తుత స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి రూ.75 లక్షలు, సిల్వర్ మెడల్ సాధిస్తే రూ.50 లక్షలు, బ్రాన్జ్ మెడల్ సాధిస్తే రూ.30 లక్షల నగదు ప్రోత్సాహకంగా ఇచ్చేలా నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన సింధుకు రూ.30 లక్షలను నగదును అందించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ