పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కు దేశ ద్రోహం కేసులో డిసెంబర్ 17, మంగళవారం నాడు మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. పర్వేజ్ ముషారఫ్పై నమోదైన దేశద్రోహం కేసును ప్రత్యేక కోర్టులో సుదీర్ఘకాలంగా విచారణ చేపట్టిన అనంతరం పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముషారఫ్ ను దోషిగా తేల్చుతూ మరణశిక్ష విధించింది. కాగా ఒక దేశ అధ్యక్షుడికి ఉరిశిక్షను విధించడం పాకిస్తాన్ దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
పర్వేజ్ ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే 2007 నవంబర్ 3న దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీని విధించారు. ఆ సమయంలో మీడియాపై ఆంక్షలు విధించడంతో పాటు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా గృహనిర్బంధం విధించారు. ఈ నేపథ్యంలో 2013 డిసెంబర్లో ముషారఫ్ పై దేశద్రోహం కేసు నమోదయింది. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగానే 2016లో ముషారఫ్ పాకిస్తాన్ విడిచి వెళ్ళిపోయాడు. విచారణకు హాజరుకావాలని కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా ఆయన హాజరు కాలేదు. ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం పూర్తీ స్థాయిలో విచారణ చేపట్టి ఈ నవంబర్లో తీర్పును రిజర్వు చేసింది. ఆ క్రమంలోనే కోర్టు ఈ రోజు ముషారఫ్ కు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే చికిత్స నిమిత్తం ముషారఫ్ ప్రస్తుతం దుబాయిలో ఉండడంతో శిక్ష అమలు విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అదేవిధంగా ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
[subscribe]