దేశంలో జనవరి 16 న కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ తొలిదశలో హెల్త్ మరియు ఫ్రంట్లైన్ వర్కర్స్ కు మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కరోనా టీకా వేయించుకోనున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా తోలిదశలో రాజకీయ నాయకులు వ్యాక్సిన్ తీసుకోవద్దని, కరోనా పోరాటంలో ముందుండి సేవలందించిన వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వారియర్స్ కే అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ చెప్పారు. 50 ఏళ్లు పైబడిన రాజకీయ నేతలంతా రెండో దశలో వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా సూచించారు. అందులో భాగంగా రెండో దశ ప్రారంభమైన తొలి రోజునే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు, ఇతర నేతలు కరోనా వ్యాక్సిన్ వేయించుకోనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత పంపిణీని బట్టి రెండో దశ వ్యాక్సినేషన్ మార్చిలో లేదా ఏప్రిల్లో ప్రారంభమవుతుందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు గురువారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా మొత్తం 8,06,484 మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా తొలిదశలో సుమారు 3 కోట్ల మంది హెల్త్ మరియు ఫ్రంట్లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ అందించే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. రెండవ దశలో 50 ఏళ్లు పైబడిన వారు మరియు 50 ఏళ్లలోపు అనారోగ్యంతో బాధపడుతున్న వారికీ కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ