ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) జారీచేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని, ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ముందుగా సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై ఎస్ఈసీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం నాడు తీర్పు వెలువరిస్తూ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. త్వరలోనే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సీఎస్, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, అని స్థాయిల అధికారులతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ముందుగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టు లోని సింగిల్ జడ్జి విచారణ చేపట్టి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కంటే ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ ముందు ఎస్ఈసీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఈసీ పిటిషన్ పై విచారణ తర్వాత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ