ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది. జూలై 30, గురువారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,557 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం రోజుల్లోగా 26,778 మెడికల్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పెషలిస్టు డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు, సహా అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 26,778 మందిని నియమించనున్నారు.
ఈ మెడికల్ పోస్టులన్నింటిని ఆగస్టు 5 లోగా భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జూలై 30, గురువారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా చికిత్సలో భాగంగా, ఆరు నెలల కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన నియమించే వీరందరికి జూలై 30 నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించాలని సూచించారు. స్పెషలిస్టు డాక్టర్లకు గౌరవ వేతనం నెలకు రూ.1,50,000 చొప్పున, జనరల్ డ్యూటీ డాక్టర్లకు నెలకు రూ.70 వేల చొప్పున చెల్లించనున్నారు. నియామకం పూర్తయిన రోజునే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu