న్యూఢిల్లీలోని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అధికారిక నివాసంలో సోమవారం “ఉగాది మిలన్” కార్యక్రమం ఘనంగా జరిగింది. వెంకయ్య నాయుడు నిర్వహించిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర (ఉగాది) వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వెంకయ్య నాయుడు నివాసంలో ప్రధాని మోదీ జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది మిలన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు.
ఈ వేడుకలకు హాజరుకావడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ “మన మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు నిర్వహించిన ఉగాది వేడుకలకు హాజరవ్వడం ఆనందంగా ఉంది. దశాబ్దాలుగా ఆయనతో పరిచయం ఉంది, సంస్కృతి పట్ల ఆయనకున్న మక్కువను, ముఖ్యమైన పండుగలను ఆయన గుర్తించే ఉత్సాహాన్ని నేను చూశాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఉగాది మిలన్ కార్యక్రమంలో భాగంగా పంచాంగ శ్రవణం, అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, రాజ్యసభ చైర్మన్ హరివంశ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు, ప్రముఖులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE