జగనన్న గోరుముద్ద పథకంలోకి మరో పోషకాహారం చేరింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా భోజన పథకంలో భాగంగా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగిజావను అందించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో వర్చువల్గా ప్రారంభించారు. కాగా దీనికోసం శ్రీ సత్యసాయి ఛారిటబుల్ ట్రస్టుతో ఏపీ విద్యాశాఖ ముఖ్యమంత్రి సమక్షంలో ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. స్కూళ్లకు వెళ్లే చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం జగనన్న గోరు ముద్దు పథకాన్ని తీసుకొచ్చామని గుర్తు చేసిన ఆయన, ఈ పథకంలో భాగంగా ప్రతి రోజూ మెనూ మార్చి బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10 వ తరగతి వరకూ చదువుతున్న 37,63,698 మంది విద్యార్థులకు రాగిజావ పౌష్టికాహారం అందించబడుతుందని, దీనికోసం ఏటా అదనంగా రూ.86 కోట్లు కేటాయిస్తున్నామని సీఎం జగన్ తెలియజేశారు. అలాగే రోజు వారీ అందిస్తున్న మెనూతో పాటు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో 5 రోజులు గుడ్డు, మూడు రోజులు బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వాలని అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఇవి ఇవ్వని రోజుల్లో పిల్లలకు తగినంత ఐరన్, కాల్షియం అందించేందుకు వీలుగా చిరుధాన్యాలను మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయాలని నిర్ణయించినట్లు కూడా ఆయన తెలిపారు. ఇక విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో విద్యార్థులకు అండగా ఉంటున్నామని, ఉన్నత విద్యలో కూడా సమూల మార్పులు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE