ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (జనవరి 19, గురువారం) మహారాష్ట్ర రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబయిలో జరిగిన సభ నుంచి దాదాపు రూ.38,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటుగా మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. ముందుగా పీఎం స్వనిధి యోజన కింద ఒక లక్ష మందికి పైగా లబ్ధిదారులకు ఆమోదం పొందిన రుణాల బదిలీని ప్రధాని మోదీ ప్రారంభించారు. సుమారు రూ.12,600 కోట్లతో నిర్మించిన ముంబయి మెట్రో రైల్ లైన్స్ 2ఏ (18.6 కి.మీ పొడవు) అండ్ 7 (16.5 కి.మీ పొడవు) ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ మెట్రో లైన్లకు 2015లో ప్రధాని మోదీనే శంకుస్థాపన చేశారు.
అలాగే దాదాపు రూ.17,200 కోట్లతో నిర్మించనున్న ఏడు మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ మురుగునీటి శుద్ధి కర్మాగారాలు మలాడ్, భాండూప్, వెర్సోవా, ఘట్కోపర్, బాంద్రా, ధారవి మరియు వర్లీలలో ఏర్పాటు చేయనున్నారు. ఇవి దాదాపు 2,460 ఎంఎల్డీ సామర్థ్యం కలిగి ఉంటాయని తెలిపారు. ముంబయిలో దాదాపు 400 కిలోమీటర్ల రోడ్ల కాంక్రీటైజషన్ ప్రాజెక్టును కూడా ప్రధాని ప్రారంభించారు. దాదాపు రూ.6,100 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ముంబయిలో దాదాపు 2050 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న మొత్తం రోడ్లలో, 1200 కిలోమీటర్ల కంటే ఎక్కువ రోడ్లు కాంక్రీటైజషన్ చేయబడ్డాయి లేదా కాంక్రీటైజషన్ ప్రక్రియలో ఉన్నాయి. అయితే మిగిలిన దాదాపు 850 కి.మీ పొడవున్న రోడ్లు గుంతల సవాళ్లను ఎదుర్కొంటున్నాయి, ఇవి రవాణాను తీవ్రంగా ప్రభావితం చేస్తుండడంతో, ఈ సవాలును అధిగమించే లక్ష్యంతో రోడ్డు కాంక్రీటైజషన్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ పునరాభివృద్ధికి కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.1,800 కోట్లకుపైగా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ముంబయిని మెరుగైన మెట్రోపాలిటన్గా మార్చడంలో నేటి పథకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, లబ్దిదారులకు, ముంబైకర్ లకు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, భారతదేశం పట్ల అదే ఆశావాదం ప్రపంచంలో కనిపిస్తుందని ప్రధాని అన్నారు. భారతదేశం తన సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటుందన్న నమ్మకం వల్లనే ఈ సానుకూలత ఏర్పడిందని అన్నారు. “నేడు భారతదేశం అపూర్వమైన విశ్వాసంతో నిండి ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ నుండి ప్రేరణ పొంది, ‘సూరజ్’ మరియు ‘స్వరాజ్’ల స్ఫూర్తి డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో బలంగా కనిపిస్తుంది” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE