దేశ రాజధానిలో మహిళలపై అకృత్యాలు సర్వసాధారణమయ్యాయి. రోజూ ఎదో ఒక ఘటన ఢిల్లీవాసులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ మహిళల భద్రత దృష్ట్యా గురువారం తెల్లవారుజామున క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో ఒక అపరిచిత వ్యక్తి కారులో స్వాతి దగ్గరకు వచ్చి, తన కారులో కూర్చోవాలని ఆమెను కోరాడు. కానీ అందుకు తిరస్కరించిన ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మందలించారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన అతను ఆమె మాట్లాడుతుండగానే చేయి పట్టి లాగుతూ కారుతో సహా ముందుకు దూసుకెళ్లాడు. దాదాపు 10 నుంచి 15 మీటర్ల దూరం స్వాతి మలివాల్ను ఈడ్చుకెళ్లాడు.
కాగా ఈ ఘటన అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) గేట్ నెంబర్ 2 వద్ద గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో జరిగినట్లు అనంతరం స్వాతి మలివాల్ పోలీసులకు తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసులు విచారణ చేపట్టి, అతడిని కారు డ్రైవర్ హరీష్ చంద్రగా గుర్తించారు. ఆ సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నాడని తేల్చారు. దీంతో కారును స్వాధీనం చేసుకుని హరీష్ చంద్రను అరెస్ట్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితునికి, బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించారు. ఇక ఈ ఘటనపై స్వాతి మలివాల్ ట్విట్టర్ వేదికగా.. దేశ రాజధానిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పైనే ఇలాంటి దాడులు జరుగుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆ సమయంలో తాను చాలా భయానక పరిస్థితిని ఎదుర్కొన్నానని, ఈరోజు ఆ దేవుడే నన్ను కాపాడాడు అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE