మే 26వ తేదీన హైదరాబాద్ మరియు చెన్నై నగరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మే 26, గురువారం నాడు ప్రధాని మోదీ ముందుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (పిజిపి) క్లాస్ 2022 గ్రాడ్యుయేషన్ వేడుకలో ప్రధాని ప్రసంగిస్తారు. ఐఎస్బీని డిసెంబర్ 2, 2001న దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించారు. దేశంలోని అగ్రశ్రేణి బి-స్కూల్స్ లో ఒకటిగా పరిగణించబడుతున్న ఐఎస్బీ, శిక్షణ మరియు సామర్థ్య పెంపునకు ప్రభుత్వంలోని అనేక మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలతో సహకరిస్తుంది.
హైదరాబాద్ పర్యటన ముగిసిన వెంటనే ప్రధాని మోదీ చెన్నైకు చేరుకోనున్నారు. గురువారం సాయంత్రం 5:45 గంటలకు చెన్నైలోని జేఎల్ఎన్ ఇండోర్ స్టేడియంలో రూ.31,400 కోట్ల విలువైన 11 ప్రాజెక్టులలో కొన్నింటిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయడంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారు. చెన్నైలో మదురై-తేని (రైల్వే గేజ్ కన్వర్షన్ ప్రాజెక్ట్), తాంబరం-చెంగల్పట్టు మూడో రైలు మార్గం సహా 2900 కోట్ల రూపాయల విలువైన ఐదు ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద రూ.116 కోట్లతో నిర్మించిన లైట్ హౌస్ ప్రాజెక్ట్-చెన్నైలో భాగంగా నిర్మించిన 1152 ఇళ్లను కూడా ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం రూ.28,500 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న ఆరు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF