ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో మంగళవారం మంత్రుల బృందం సీపీఎస్ అంశంపై సంప్రదింపుల (కన్సల్టేటివ్) భేటీని నిర్వహించింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు జీపీఎస్పై తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని ఉద్యోగులను కోరారు మంత్రులు. సీపీఎస్ రద్దు చేస్తామని గతంలో చెప్పిన మాట వాస్తవమేనని, అయితే సీపీఎస్ వల్ల నష్టం కలుగుతుందనే జీపీఎస్ ప్రతిపాదన తెచ్చామని వివరించారు. జీపీఎస్తో ఉద్యోగులకు పెన్షన్ భద్రత కలుగుతుందని, జీపీఎస్లో ఏమైనా అదనపు ప్రయోజనాలు కావాలంటే పరిశీలిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
అయితే జీపీఎస్పై ఉద్యోగ సంఘాల నేతలు తమ అభిప్రాయాలు చెప్పారు. జీపీఎస్లో లోపాలు ఉన్నాయని, జీపీఎస్ ప్రతిపాదనలు దారుణంగా ఉన్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. తమకు పాత పెన్షన్ విధానం మాత్రమే కావాలని, ఓపీఎస్ వచ్చేవరకు మా పోరాటం కొనసాగిస్తామని బండి శ్రీనివాసరావు అన్నారు. ఇంకా 2003లో చేరిన ఉద్యోగులను ఓపీఎస్లోకి తీసుకోవాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. మాకు జీపీఎస్ వద్దు, ఓపీఎస్ మాత్రమే కావాలని ఏపీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఇకపై ఓపీఎస్ మినహా ఏ ప్రతిపాదనతో పిలిచినా చర్చలకు రామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, మరో ప్రభుత్వ సలహాదారు పి.చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉద్యోగ సంఘాల తరపున యూనియన్ ప్రతినిధులులు.. ఎపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ప్రసాద్ సహా ఇతర నేతలు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ