ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14, ఆదివారం నాడు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ముందుగా చెన్నైలో అనేక కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు చేయనున్నారు. చెన్నై మెట్రో రైల్ మొదటి దశ విస్తరణ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. చెన్నై బీచ్ కు, అత్తిపట్టు కు మధ్య నాలుగో రైలు మార్గాన్ని, విల్లుపురం-కడలూరు-మైలాదుతురై-తంజావూరులతో పాటు, మైలాదుతురై-తిరువారూర్ లో సింగిల్ లైన్ సెక్షన్ యొక్క రైల్వే విద్యుదీకరణను ప్రారంభించనున్నారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా అత్యాధునికమైన అర్జున్ ప్రధాన యుద్ద ట్యాంకును (ఎమ్కె-1ఎ) భారత సైన్యానికి అప్పగించనున్నారు. ఐఐటి మద్రాసులో డిస్కవరీ క్యాంపస్ కు, ఆనికట్ కెనాల్ సిస్టమ్ విస్తరణ, ఆధునీకరణలకు శంకు స్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో తమిళనాడు గవర్నరు భన్వరీలాల్ పురోహిత్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పాల్గొననున్నారు.
అనంతరం సాయంత్రం 3:30 గంటలకు కేరళలోని కొచ్చి చేరుకొని వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు, మరికొన్ని పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా బిపిసిఎల్ కు చెందిన ప్రొఫైలిన్ డిరివేటివ్ పెట్రో కెమికల్ ప్రాజెక్టు (పిడిపిపి)ని దేశానికి అంకితం చేయనున్నారు. కొచ్చిన్ పోర్టులో సాగరిక పేరుతో ఉన్న అంతర్జాతీయ క్రూజ్ టర్మినల్ ను, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లోని మెరైన్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ను ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం కొచ్చిన్ పోర్టులో సౌత్ కోల్ బెర్త్ పునర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ