కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని వెల్దుర్తి మండలంలోని మాదార్ పురం హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44 పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది (8 మంది మహిళలు, 5మంది పురుషులు, చిన్న బాలుడు) అక్కడికక్కడే మృతి చెందారు. టెంపో వాహనం నుజ్జునుజ్జవ్వడంతో మృతదేహాలన్నీ అందులో ఇరుక్కుపోయాయి. క్రేన్ సాయంతో టెంపో వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 18 మంది ఉండగా, మరో నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సంఘటనా స్థలికి చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును, వెల్దుర్తి, డోన్ ఎస్.ఐలు, సిఐలు, డిఎస్పీ, పోలీసు అధికారులు, డిటీసీ అధికారులు, స్థానికులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నలుగురు క్షతగాత్రులకు అన్ని రకాల మెరుగైన వైద్య సహాయం అందించాలని కర్నూలు జిజిహెచ్ డాక్టర్లను, డిఎంహెచ్ఓలను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. టెంపోలో ప్రయాణికులు మదనపల్లి నుండి అజ్మీర్/దైవ దర్శనానికి వెళుతున్న రెండు కుటుంబాల సభ్యులుగా గుర్తించారు. మరోవైపు వివరాలు సేకరించి ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ