జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో విస్తరించివున్న 13 అసెంబ్లీ స్థానాలలో నవంబర్ 30, శనివారం నాడు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తొలిదశలో సుమారు 37 లక్షల మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. శనివారం ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. తోలి దశలో పోలింగ్ జరిగే 13 స్థానాల్లో బీజేపీ 12 స్థానాల్లో పోటీ చేస్తూండగా, హుస్సేయినాబాద్ స్థానంలో బీజేపీ స్వతంత్ర అభ్యర్థికి మద్దతిస్తోంది. మరో వైపు బీజేపీకి పోటీగా కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ మహా కూటమిగా ఏర్పడ్డాయి.
రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా, అయిదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30, డిసెంబర్ 7, డిసెంబర్ 12, డిసెంబర్ 16, డిసెంబర్ 20వ తేదీలలో పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 23న వెల్లడిస్తారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు అక్కడి ప్రజలు ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ కట్టబెట్టలేదు. 2014 ఎన్నికల్లో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ) కూటమి 41 స్థానాలు గెలుచుకుని ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ నేతృత్వంలో అయిదేళ్ల పాటు స్థిరమైన ప్రభుత్వాన్ని నడిపించారు.
[subscribe]