రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గౌతమ్ ఇండస్ట్రీస్ అధినేత గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. ఈ మేరకు ప్రఖ్యాత ఫోర్బ్స్ రియల్ టైమ్ ప్రకటించింది. అది ప్రకటించిన బిలియనీర్స్-2023 జాబితా ప్రకారం.. ప్రస్తుతం 84.3 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో ఉండగా.. గౌతమ్ అదానీ 83.9 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఆస్తులు 0.19 శాతం పెరిగి 164 మిలియన్ డాలర్ల సంపద పెరగడంతో అంబానీ అదానీని అధిగమించగా, గౌతమ్ అదానీ ఆస్తులు 4.62 శాతం తగ్గి పారిశ్రామికవేత్త సంపద 84.1 బిలియన్ డాలర్లుగా నమోదైందని రియల్ టైమ్ ట్రాకర్ పేర్కొంది.
కాగా ఇటీవల అమెరికాలోని హిండెన్ బర్గ్ సంస్థ వెల్లడించిన నివేదికలో అదానీ గ్రూప్లో లొసుగులను బయటపెట్టడంతో ఆ సంస్థ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. దీంతో షేర్ మార్కెట్లో అదానీ సంస్థకు చెందిన వేల కోట్ల సంపద ఆవిరైంది. తద్వారా ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ 10వ స్థానానికి పడిపోయారు. అయితే అంబానీ 9వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజ సంస్థ ఎల్వీఎంహెచ్ అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొదటి స్థానంలో నిలవగా.. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా.. అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్, ఒరాకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్, బెర్క్షైర్ హాత్వే చీఫ్ వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్, టెలికాం దిగ్గజం కార్లోస్ స్లిమ్ హేలు అండ్ ఫ్యామిలీ, గూగుల్ అధినేత లారీ పేజ్ వరుసగా మూడు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE