రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించి 200 రోజులకు పైనే అవుతోంది. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభించినప్పుడు తనకున్న సైనిక బలంతో కేవలం రోజుల వ్యవధిలోనే దానిని స్వాధీనం చేసుకోవచ్చని భావించిన ఆయనకు ఉక్రెయిన్ అనూహ్య రీతిలో ఎదురు నిలిచింది. నాటో దేశాల నుంచి అందుతున్న ఆర్ధిక సాయం మరియు యుద్ధ పరికరాల సాయంతో రష్యాకు తీవ్రంగా ప్రతిఘటన ఇస్తోంది. దీంతో దాదాపు ఏడు నెలలు అవుతున్నా ఇప్పటికీ పైచేయి సాధించలేని పరిస్థితిలో ఇరుక్కుంది. ఒకవైపు ఉక్రెయిన్ను పూర్తిగా స్వాధీనం చేసుకోలేకపోవడం, మరోవైపు యుద్దాన్ని విరమించుకోలేని పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇక ఉక్రెయిన్ ప్రతిఘటన నేపథ్యంలో సైనికులని కూడా భారీగానే కోల్పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా సైనికులు 5937 మంది చనిపోయినట్లు ప్రకటించిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోగు, ఉక్రెయిన్ సైనికుల సంఖ్య దీనికి 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయడానికి నిశ్చయించుకున్న పుతిన్ దేశంలో పాక్షిక సైనిక సమీకరణకు పిలుపునిచ్చారు. తూర్పు మరియు దక్షిణ ఉక్రెయిన్లోని రష్యా-నియంత్రిత ప్రాంతాలు రష్యాలో అంతర్భాగాలుగా మారడానికి ఓట్లను నిర్వహించే ప్రణాళికలను ప్రకటించిన ఒక రోజు తర్వాత పుతిన్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. దేశ సమగ్రతను కాపాడుకునే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. దీనిలో భాగంగా దేశ రక్షణకు రిజర్వ్ సైనికుల్ని కూడా సాయుధ బలగాలతో కలవాలని కోరారు. పశ్చిమ దేశాలు రష్యాను బ్లాక్మెయిల్ చేస్తున్నాయని, మనపై ఆయా దేశాల ఆధిపత్యాన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. రష్యాను, ప్రజలను కాపాడుకునేందుకు, తమ వద్ద ఉన్న అన్ని రకాల వ్యవస్థలను వాడుకుంటామని, అణ్వాయుధాలను బూచిగా చూపించి బెదిరించాలనుకునేవాళ్లు అవి తమ దగ్గర కూడా ఉన్నాయనే విషయాన్నీ కూడా గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కాగా పుతిన్ పిలుపుతో సుమారు 3 లక్షల మంది రిజర్వ్ లేదా మాజీ సైనికులు దళంలో చేరనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY