దుబాయ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ మెరిసింది. స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సరికొత్త చరిత్ర లిఖించింది. దాదాపు 6 దశాబ్దాల (58 ఏళ్ళు) తర్వాత ఈ మెగాటోర్నీలో స్వర్ణం సాధించిన భారత షట్లర్లుగా వీరిద్దరూ చరిత్ర సృష్టించారు. ఇక పురుషుల డబుల్స్లో భారత్కు ఇదే తొలి స్వర్ణం కాగా.. గతంలో దినేశ్ ఖన్నా 1965లో పురుషుల సింగిల్స్ చాంపియన్గా నిలిచాడు. ఆసియా చాంపియన్షిప్ డబుల్స్లో భారత్ నుంచి చివరిసారిగా దీపు ఘోష్-రమన్ ఘోష్ జంట 1971లో కాంస్యం నెగ్గింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ డబుల్స్లో ఏకంగా స్వర్ణ పతకం సాధించడం విశేషం. అల్ నసర్ క్లబ్లో షేక్ రషీద్ బిన్ హమ్దాన్ ఇండోర్ హాల్లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో ప్రపంచ నంబర్ 8 ర్యాంకర్లయిన మలేసియాకు చెందిన యెన్ సిన్-టెయో ఈ యి జంటపై ప్రపంచ నంబర్ 6 జోడీ అయిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి చారిత్రక విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
అయితే ఈ జోడీ తొలుత ఒత్తిడి కారణంగా 16-21తో ఓపెనింగ్ గేమ్ను చేజార్చుకున్నారు. అయితే అనంతరం అద్భుతంగా పుంజుకుని 21-17తో రెండవ గేమ్ను, 21-19తో మూడో గేమ్ను కైవసం చేసుకున్నారు. తద్వారా సాత్విక్ – చిరాగ్ జోడి భారత్కు చిరస్మరణీయ విజయం అందించారు. ఇక చారిత్రక విజయం సాధించిన ఈ జోడీపై భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ ప్రశంసల జల్లు కురిపించారు. వీరి విజయం అత్యద్భుతమని, అంతర్జాతీయ వేదికపై భారత్ జెండాను సగర్వంగా ఎగిరేలా చేశారని కొనియాడారు. అలాగే ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉన్న సాత్విక్-చిరాగ్ జోడీ భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగిస్తూ మరిన్ని భారత్కు విజయాలు సాధించి పెట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీకి రూ. 20 లక్షల ప్రైజ్మనీని అందిస్తున్నట్లు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE