దేశంలో అన్ని రాష్ట్రాల యూనివర్సిటీలు, కాలేజీ విద్యార్థుల ఫైనల్ ఇయర్/సెమిస్టరు పరీక్షల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాల్సిందేనని, పరీక్షలు జరపకుండా వారిని ప్రమోట్ చేసే అవకాశం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీచేసిన మార్గదర్శకాలను జస్టిస్ అశోక్భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సమర్ధించింది. ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి వలన ఏమైనా ఇబ్బందులు ఉంటే సెప్టెంబర్ 30 గడువుపై పొడిగింపు కోరి, పరీక్షల్ని వాయిదా వేసేందుకు యూజీసీని సంప్రదించవచ్చని కోర్టు పేర్కొంది. పరీక్షల్ని వాయిదా వేయాలని స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ నిర్ణయించవచ్చు గాని, పరీక్షలు నిర్వహించకుండా రద్దుచేసి విద్యార్థులను పాస్ చేసి ప్రమోట్ చేసే అధికారం వాటికీ ఉందని పేర్కొన్నారు.
ముందుగా సెప్టెంబర్ చివరి కల్లా తప్పనిసరిగా డిగ్రీ, పీజీ ఇతర కోర్సుల ఫైనల్ ఇయర్/ సెమిస్టరు పరీక్షలు నిర్వహించాలని యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి సమయంలో పరీక్షల నిర్వహణ అంశంలో యూజీసీ మార్గదర్శకాలపై పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక విచారణ జరిపింది. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిందేనని, రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేయలేవని పేర్కొంటూ కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu