టోక్యో ఒలింపిక్స్-2020 క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. టోక్యోలోని నేషనల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు జపాన్ చక్రవర్తి నరాహితో, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బేచ్, ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ హాజరయ్యారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 1000 మందిలోపు అతిథులతోనే నిర్వహించారు.
జపనీస్ అల్పాబెట్ వరుసక్రమానికి అనుగుణంగా దేశాల క్రీడాకారులకు స్వాగతం చెప్పారు. 21వ స్థానంలో భారత అథ్లెట్ల బృందం స్టేడియంలోకి అడుగుపెట్టింది. భారత పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ భారత జెండాని పట్టుకుని ముందుకు నడవగా, మిగతా భారత బృందమంతా భారత జెండాలను రెపరెపలాడిస్తూ వారివెంట సాగారు. భారత బృందం స్టేడియంలోకి ప్రవేశించగానే టీవీలో వీక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ భారత అథ్లెట్లను ఉత్సాహపరుస్తూ, ఆల్ ది బెస్ట్ చెప్పారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, క్రీడా శాఖ సహాయమంత్రి నిషిత్ ప్రమాణక్ కూడా భారత బృందానికి అభినందనలు తెలిపారు.
ఒలింపిక్స్లో భారత్ ప్రాతినిధ్యం వహించడం ఇది 25వ సారి కాగా, ఇప్పటివరకు దేశం నుంచి ఒలింపిక్స్లో పాల్గొన్న బృందాలలో ఇదే అతి పెద్దది. ఈసారి భారత్ నుంచి 18 క్రీడా విభాగాలలో మొత్తం 126 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. ఈ ఒలింపిక్స్ క్రీడల్లో 200 కి పైగా దేశాలు, 11వేల మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 33 విభాగాల్లో 339 ఈవెంట్లు జరగనున్నాయి. జూలై 23, 2021 నుంచి ఆగస్టు 8, 2021 వరకు ఒలింపిక్స్ క్రీడలు జరగనుండగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ప్రేక్షకులను అనుమతించ వద్దని నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ