ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన మేరకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పీఎంఏవై-యూ) పథకాన్ని డిసెంబర్ 31, 2024 వరకు కొనసాగించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే అనగా మార్చి 31, 2022 వరకు మంజూరైన 122.69 లక్షల ఇళ్లను పూర్తి చేసేందుకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.
ప్రధాని మోదీ ప్రభుత్వ హయాంలో అర్హులైన పట్టణ వాసులందరికీ సంతృప్త పద్ధతిలో ఇళ్లను అందించేందుకు పీఎంఏవై-యూ పథకం ప్రారంభించారు. 2017లో ఈ పథకం అసలు అంచనా 100 లక్షల ఇళ్లు కాగా, ఈ అసలు అంచనా మించి 102 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ చేయబడ్డాయి/నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 62 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇక మొత్తం మంజూరైన 123 లక్షల ఇళ్లలో, 40 లక్షల ఇళ్ల ప్రతిపాదనలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆలస్యంగా (స్కీమ్ అమలులో గత 2 సంవత్సరాల కాలంలో) అందాయి. దీంతో వాటిని పూర్తి చేయడానికి మరో రెండేళ్లు పట్టనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థనల ఆధారంగా, కేంద్ర కేబినెట్ పీఎంఏవై-యూ అమలు వ్యవధిని డిసెంబర్ 31, 2024 వరకు పొడిగించాలని నిర్ణయించింది.
2015 నుండి పీఎంఏవై-యూ పథకం కోసం ఆమోదించబడిన కేంద్ర సహాయం రూ. 2.03 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. మార్చి 31, 2022 వరకు, రూ.1,18,020.46 కోట్ల కేంద్ర సహాయం/సబ్సిడీ ఇప్పటికే విడుదల చేయబడగా, డిసెంబర్ 31, 2024 వరకు మిగిలిన రూ.85,406 కోట్లు కేంద్ర సహాయం/సబ్సిడీగా విడుదల చేయబడతాయని తెలిపారు.
అందరికీ హౌసింగ్ లో భాగంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా దేశంలోని అర్బన్ ప్రాంతాల్లోని అర్హులైన లబ్ధిదారులందరికీ అన్ని సదుపాయాలతో పక్కా గృహాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలలో పీఎంఏవై-యూ ఒకటి. ఈ పథకం దేశంలోని మొత్తం పట్టణ ప్రాంతాలకు వర్తిస్తుంది, అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న అన్ని చట్టబద్ధమైన పట్టణాలు మరియు నోటిఫైడ్ ప్లానింగ్/డెవలప్మెంట్ ఏరియాలతో సహా ఆ తర్వాత నోటిఫై చేయబడిన పట్టణాలకు వర్తిస్తుంది. ఈ పథకం బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్/ఎన్హాన్స్మెంట్ (బీఎల్సీ), సరసమైన హౌసింగ్ ఇన్ పార్టనర్షిప్ (ఏహెఛ్పీ), ఇన్-సిటు స్లమ్ రీడెవలప్మెంట్ (ఐఎస్ఎస్ఆర్) మరియు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) వంటి నాలుగు రకాలుగా అమలు చేయబడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం/కేంద్రపాలిత ప్రాంతాలు లబ్ధిదారుల ఎంపికతో సహా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY