మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్ (పీఎంఎవై-జి) కింద నిర్మించిన 1.75 లక్షల గృహల ప్రవేశ కార్యక్రమంలో వర్చువల్ విధానం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి లబ్ధిదారులతో ప్రధాని సంభాషించారు. ఈ రోజు తమ కొత్త ఇళ్లలోకి ప్రవేశిస్తున్న 1.75 లక్షల లబ్ధిదారుల కుటుంబాలకు తమ కలల ఇల్లు లభించిందని, వారి పిల్లల భవిష్యత్తుపై విశ్వాసం పెరిగిందని అన్నారు. కరోనా సమయంలో సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 18 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, వాటిలో 1.75 లక్షల ఇళ్ళు మధ్యప్రదేశ్లోనే పూర్తయ్యాయని ప్రధాని చెప్పారు. పీఎంఎవై-జి కింద ఇల్లు నిర్మించడానికి సగటున 125 రోజులు పడుతుందని, అయితే ఈ కరోనా కాలంలో కేవలం 45 నుండి 60 రోజులలో పూర్తయిందని, ఇది ఒక రికార్డు అని ప్రధాని అన్నారు. నగరాల నుండి తమ గ్రామాలకు వలసకార్మికులు చేరుకోవడం వలనే ఇది సాధ్యమైందని అన్నారు.
పేదలకు ఇల్లు రావడం మాత్రమే కాదు, వారికి మరుగుదొడ్లు, ఉజ్జ్వల గ్యాస్ కనెక్షన్, సౌభాగ్య యోజన, పవర్ కనెక్షన్, ఎల్ఈడి బల్బ్, వాటర్ కనెక్షన్ కూడా అందుతున్నాయని ప్రధాని అన్నారు. గ్రామీణ ప్రజల జీవితాలను మార్చడంలో పీఎం ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి పథకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 27 సంక్షేమ పథకాలను పీఎం ఆవాస్ యోజనతో అనుసంధానించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్ళు ఎక్కువగా మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయబడ్డాయని లేదా ఇంటి మహిళతో కలిసి సంయుక్తంగా నమోదు చేయబడ్డాయని పేర్కొన్నారు. అలాగే రాబోయే 1000 రోజుల్లో సుమారు 6 వేల గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసే అంశాన్ని ప్రధాని గుర్తు చేశారు. గ్రామాలకు మెరుగైన మరియు వేగవంతమైన ఇంటర్నెట్ వచ్చినప్పుడు, ఆ గ్రామంలోని పిల్లలకు విద్యకు మంచి అవకాశాలు లభిస్తాయని, యువతకు మంచి వ్యాపార అవకాశాలు లభిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu