అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “తరతరాలుగా పెద్దలు మన సంస్కృతిని భాషలోనే నిక్షిప్తం చేశారు. మాతృభాష మన అస్తిత్వాన్ని తెలియజేయడమే గాక, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అందుకే అమ్మభాషలో మాట్లాడేందుకు గర్వించాలి. సోదర భాషలను గౌరవించాలి. వందలాది భాషల సహజీవనంతో కూడిన భాషా వైవిధ్యం భారతీయుల సొంతం. మన సృజనాత్మక ఆలోచనలు, భావ వ్యక్తీకరణకు భాషే కీలకం. మాతృభాషల్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం, ముందు తరాలకు అందజేయడం మనందరి బాధ్యత. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని పిలుపునిస్తున్నాను” అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
భాషా వైవిధ్యం, సాంస్కృతిక వైవిధ్యంపై అవగాహనను పెంపొందించేందుకు మరియు బహుభాషా వాదాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొదటిసారిగా నవంబరు 17, 1999న యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) దీన్ని ప్రకటించింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ చేత కూడా అధికారికంగా గుర్తించబడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ