దక్షిణాఫ్రికాతో సిరీస్ లో భాగంగా మూడు టీ20 మ్యాచ్ ల అనంతరం జరిగే మూడు టెస్టులకు ఎమ్మెస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను గురువారం నాడు ప్రకటించారు. అందరూ ఊహించినట్టుగానే ఇటీవల అంతగా రాణించని కేఎల్ రాహుల్ పై వేటు పడింది. వెస్టిండీస్ పర్యటనలో విఫలమైన తర్వాత మాజీ ఆటగాళ్ల నుంచి విమర్శలు ఎదురుకుంటున్న కేఎల్ రాహుల్ ను జట్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు ఎంపిక చేసిన రోహిత్ శర్మకు ఈసారి టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం ఇస్తామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ ధృవీకరించారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. ఇటీవల అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్న పంజాబ్ ఓపెనర్ శుబ్మన్ గిల్ కు కూడ టెస్టుల్లో ఆడేందుకు తొలిసారి అవకాశం లభించింది. బౌలర్లలో స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ ను పక్కనపెట్టి కుల్ దీప్ యాదవ్ కు చోటు కల్పించారు.వికెట్ కీపర్ స్థానానికి సాహా, రిషబ్ పంత్ లను ఎంపిక చేసారు.
టెస్టు సిరీస్ కు ఎంపికైన భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చటేశ్వర్ పూజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), హనుమ విహారీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్దిమాన్ సాహా, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ, శుబ్మన్ గిల్.