ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల విధానంలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించేందుకు ఇటీవలే ఏపీ మౌలిక సదుపాయాల చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. మరో అడుగు ముందుకేస్తూ అందుకు సంబంధించిన కీలక నియామకాన్ని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావుకు టెండర్ల పక్రియ న్యాయపరిశీలన బాధ్యతలును అప్పగించింది. ఆయన మూడేళ్ళ పాటు ఈ బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ మేరకు మౌలిక సదుపాయాలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేసారు.
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవం చేసిన రోజునే, టెండర్ల ప్రక్రియలో అవినీతికి తావులేకుండా వాటిని పరిశీలించేందుకు జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తామని, అందుకోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తామని ప్రకటించారు. అందుకు కొనసాగింపుగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి చాగరి ప్రవీణ్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి, న్యాయపరిశీలన బాధ్యతలు చేపట్టేందుకు విశ్రాంతి న్యాయమూర్తి పేరు సూచించామని కోరింది. ఆయన సిఫార్సు మేరకు జస్టిస్ బి.శివశంకరరావుకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. కొత్త చట్టం విధానాల ప్రకారం ఇకపై రూ.100 కోట్ల పైనా విలువ కలిగిన అన్ని పనుల వివరాలను ముందు న్యాయపరిశీలనకు పంపుతారు. న్యాయపరిశీలన అనంతరం ఆ టెండర్లపై నిర్ణయం తీసుకుంటారు.
[subscribe]
[youtube_video videoid=i6Ujs90EoJI]