దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, పదిమంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్-2020 మార్చ్ 29 నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దాన్ని ఏప్రిల్ 15కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటిలోగా లేదా మే నెల మొదటివారం లోగా పరిస్థితులు సద్ధుమణిగితేనే ఐపీఎల్ను అభిమానుల మధ్య నిర్వహించడానికి ప్రయత్నించడం, లేకుంటే ఐపీఎల్ పూర్తిగా రద్దయ్యే అవకాశమున్నట్టు తెలుస్తుంది.
ఐపీఎల్-2020 పై మార్చ్ నెల చివరి కల్లా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. మరోవైపు మార్చ్ 24, మంగళవారం నాడు ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో బోర్డు సమావేశం కావాల్సి ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బీసీసీఐ కార్యాలయం మూసివేయడంతో ఈ సమావేశం నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ సమావేశం నిర్వహించాలని భావిస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగించే అవకాశం ఉంది. ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ మాట్లాడుతూ, లీగ్పై ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదని, ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్ ను వాయిదా వేసిన కూడా ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారాయని చెప్పారు.