మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో బలపరీక్షకు ముందే మార్చ్ 20న ముఖ్యమంత్రి పదవికి కమల్ నాథ్ రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. గతంలో మూడు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహన్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మార్చ్ 23, సోమవారం రాత్రి 7 గంటలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశమునట్టు సమాచారం. మరోవైపు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో అతి త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు సమావేశమై సీఎం అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివరాజ్సింగ్ తో పాటుగా కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్, నరోత్తమ్ మిశ్రా పేర్లు వినిపిస్తున్నప్పటికీ మరోసారి సీఎంగా శివరాజ్సింగ్ యే బాధ్యతలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది .
ముందుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో అతని వర్గీయులైన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో ఆరుగురి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మార్చ్ 20, సాయంత్రం 5 గంటలలోపు ముఖ్యమంత్రి కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరీక్షలో నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బలం నిరూపించుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్నాథ్ ముందుగానే రాజీనామా చేశారు.