క్రికెట్ ప్రపంచకప్-2019 లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బౌండరీల లెక్క ప్రకారం ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడంతో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అనేక మంది క్రికెటర్లు, అభిమానులు సూపర్ ఓవర్ టైగా ముగియడంతో బౌండరీల ప్రకారం విజేతను ప్రకటించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు. ఆ నేపథ్యంలో ఈ నిబంధనపై సమీక్ష జరిపేందుకు భారత మాజీ ఆటగాడు, స్పిన్నర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో ఐసీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
అక్టోబర్ 14, సోమవారం నాడు జరిగిన ఐసీసీ తాజా సమావేశంలో అనిల్ కుంబ్లే కమిటీ సిపార్సుల మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రపంచ కప్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో సూపర్ ఓవర్ కూడ టై గా మారితే, బౌండరీల లెక్కల ప్రకారం విజేతను నిర్ణయించబోమని, తుది ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్లను ఆడిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. అంతే గాక ఇప్పటివరకు నాకౌట్ దశలోనే సూపర్ ఓవర్లను ఆడించేవారు. ఇక నుంచి లీగ్ దశలోనూ ఇరుజట్ల స్కోర్ సమం అయితే సూపర్ ఓవర్ ఆడించనున్నారు. కానీ ఈ లీగ్ దశలో సూపర్ ఓవర్ టై గా ముగిస్తే అయితే మ్యాచ్ను టై గా పరిగణించబోతున్నారు. ఇంకో సూపర్ ఓవర్ కి అవకాశం ఉండదు. అదే విధంగా జింబాబ్వే, నేపాల్ జట్లపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఈ సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకుంది.