తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ మొదలు పెట్టిన సమ్మె నేపథ్యంలో, ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పరిస్థితులు మారిపోతున్నాయి. టిఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు, పలు కార్మిక సంఘాల నేతలు అక్టోబర్ 14, సోమవారం నాడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. ఆర్టీసీ సమ్మె, తదనంతరం జరిగిన సంఘటనలపై ఆమెకు వివరించి వినతిపత్రం సమర్పించారు. గవర్నర్ ను కలిసిన అనంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు మధ్య కేశవరావు మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వానం పలకాలన్నారు. ప్రభుత్వం తరుపున ఆయన ఆహ్వానిస్తే చర్చలకు రావడానికి వారు సిద్ధమే అని ప్రకటించారు.
రాష్ట్ర మంత్రులు రోజుకో విధంగా మాట్లాడుతూ, కార్మికులను రెచ్చగొడుతున్నారని అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. మరో వైపు టీఎన్జీయూ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఉద్యోగ సంఘాలతో నిన్న భేటీ కావాలని అనుకున్నాం గాని, డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి మరణించడంతో కలవడం కుదరలేదని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో త్వరలో భేటీ అయ్యి మద్ధతు కోరతామని పేర్కొన్నారు. తాము కార్మికుల పరిరక్షణ కోసమే పనిచేస్తున్నామని, ఇతర ఏ రాజకీయ నాయకులతో ఒప్పందాలు లేవని ఆయన తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ యే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులను గుర్తిస్తామని చెప్పారని గుర్తు చేసారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన వ్యాఖ్యానించారు.
[subscribe]