ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ ను భారత జట్టు ఘనంగా ప్రారంభించింది. తోలి టెస్టులో 203 పరుగులతో విజయం సాధించడంతో భారత జట్టు మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తోలి ఇన్నింగ్స్ లో మంచి పోరాట ప్రతిభ కనబర్చిన దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ రెండో ఇన్నింగ్స్ లో చేతులెత్తేశారు. 394 పరుగుల లక్ష్యంతో ఐదవ రోజు ఓవర్ నైట్ స్కోర్ 11/1 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు భారత బౌలర్లు షమీ, రవీంద్ర జడేజా ధాటికి 191 పరుగులకే 10 వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. ఈ ఇన్నింగ్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ 35 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజాకు 4 వికెట్లు, అశ్విన్కు ఒక వికెట్ దక్కాయి. ఇక ఈ టెస్టులో ఓపెనర్ గా వచ్చి రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు సాధించిన రోహిత్ శర్మకు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన భారతజట్టు తోలి ఇన్నింగ్స్ లో 502/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 215 పరుగుచేయగా, రోహిత్ శర్మ 176 పరుగులతో రాణించారు, బౌలర్లలో కేశవ్ మహారాజ్ 3వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా సైతం తోలి ఇన్నింగ్స్ లో మంచి ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ 160 పరుగులు, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ 113 పరుగులతో సెంచరీలు చేయగా, కెప్టెన్ డుప్లెసిస్ 55 పరుగులు చేసాడు. అశ్విన్ ఈ ఇన్నింగ్స్ లో 7వికెట్లు దక్కించుకోగా, రవీంద్ర జడేజా 2వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్ ఆడిన భారతజట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 323 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రోహిత్ శర్మ 127, చటేశ్వర్ పుజారా 81, రవీంద్ర జడేజా 40 పరుగులతో రాణించారు. 394 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా జట్టు కనీస పోటీ ఇవ్వలేక 191 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టెస్టు విజయంతో టెస్టు ఛాంపియన్ షిప్ లో ఇప్పటికే 120 పాయింట్స్ తో ఉన్న భారతజట్టు మరో 40 పాయింట్స్ సాధించి అగ్రస్థానంలో ఉంది. 60 పాయింట్స్ తో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. రెండో టెస్టు అక్టోబర్ 10, గురువారం నుంచి పుణేలో జరగనుంది.