తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులును నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలతో సహా పలువురు జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసారు. సమ్మె నేపథ్యంలో అమరవీరులకు నివాళులు అర్పించడానికి వస్తే అడ్డుకుని అరెస్ట్ చేయడం దారుణమని, తమను అక్రమంగా అరెస్ట్ చేసారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు, అనేక మంది చేసిన త్యాగాల ఫలితంగానే ఇవాళ తెరాస ప్రభుత్వం అధికారంలో ఉందని, అరెస్టులకు భయపడేది లేదని పేర్కొన్నారు.
ఉదయం అసెంబ్లీ దగ్గర్లో ఉన్న గన్ పార్క్ వద్ద నివాళులర్పించేందుకు భారీ సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గన్ పార్క్ వద్ద నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదని అక్కడి తరలివచ్చిన వారిని పోలీసులు అడ్డుకుని, ఎక్కడికక్కడ అరెస్టు చేసారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల కూడ అక్కడకు రావడంతో వారిని అరెస్ట్ చేసారు. మరోవైపు ఆర్టీసీ జేఏసీ నాయకులు ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన దీక్ష వాయిదా పడింది. పోలీసులు దీక్షకు అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా వేసుకున్నట్టు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ రోజు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో సమావేశమయ్యి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
[subscribe]