కోల్ కతా లోని ఈడెన్గార్డెన్స్లో నేటినుంచి భారత్-వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్ల T-20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య బుధవారం ఇక్కడి ఈడెన్గార్డెన్స్లో తొలి పోరు జరుగనుంది. అయితే, అన్ని మ్యాచ్లు ఈడెన్గార్డెన్స్ వేదికగానే జరుగనున్నాయి. వన్డే ఫార్మాట్ను క్లీన్ స్వీప్ చేసి సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా.. అదే జోష్ లో T-20 సిరీస్ గెలుచుకునేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖర్లో ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే జట్టు కూర్పుపై దృష్టి పెట్టింది. రోహిత్, కోహ్లీ, ఇషాన్, సూర్యకుమార్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తోంది.
మరోవైపు ఐపీఎల్లో జాక్పాట్ కొట్టిన వెస్టిండీస్ ఆటగాళ్లు, T-20 ఫార్మాట్లో టీమ్ఇండియాపై ఆధిపత్యం చెలాయించేందుకు రెడీ అవుతున్నారు. ముంబై ఇండియన్స్కు మూల స్తంభాలైన రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్ మధ్య ఆసక్తికర పోరు ఖాయంగా కనిపిస్తున్నది. విండీస్ టీమ్ T-20 లలో ఎప్పుడూ ప్రమాదకరమైన జట్టే. పొట్టి ఫార్మాట్లో ఏ క్షణాన్నైనా మ్యాచ్ను మలుపు తిప్పగల ఆటగాళ్లు ఉండటం విండీస్కు కలిసొచ్చే అంశం. మయేర్స్, కింగ్, పూరన్, పొలార్డ్, పావెల్, హోల్డర్, షెఫర్డ్ తమదైన రోజు విధ్వంసం సృష్టించగలరు. ఐపీఎల్లో 10.75 కోట్లు దక్కించుకున్న నికోలస్ పూరన్ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడు.