తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు జనవరి 10, శుక్రవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న 9 కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీలకు అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. 9 కార్పొరేషన్లలో 325 కార్పోరేటర్ డివిజన్లకు, 120 మున్సిపాలిటీలలో 2,727 వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం రాత్రి 7:45 వరకు రాష్ట్రవ్యాప్తంగా 21,850 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. అలాగే ఇందులో 574 నామినేషన్లు ఆన్లైన్లో అందినట్టుగా వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలో అత్యధికంగా 2,392 నామినేషన్లు దాఖలు కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలో అత్యల్పంగా 134 నామినేషన్లు దాఖలయ్యాయి.
జనవరి 11, శనివారం ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన పక్రియ ప్రారంభిస్తారు. పరిశీలన పూర్తయ్యాక సరైన పద్దతిలో నామినేషన్స్ సమర్పించిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు 12వ తేదీ సాయంత్రం 5 గంటల దాకా జిల్లా ఎన్నికల అధికారుల వద్ద అప్పీల్ చేసుకోవచ్చు. 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఈ తిరస్కరణ అప్పీళ్లను పరిష్కరిస్తారు. అనంతరం జనవరి 14న మధ్యాహ్నం 3 గంటల దాకా నామినేషన్ల ఉపసంహరణ చేసుకునేవారికి అవకాశం కల్పిస్తారు. అదేరోజు సాయంత్రం ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటిస్తారు. జనవరి 22వ తేదీన పోలింగ్ నిర్వహించి, 25న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. మరోవైపు కరీంనగర్ కార్పోరేషన్ కు ఆలస్యంగా నోటిఫికేషన్ విడుదల చేయడంతోలో జనవరి 12 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
[subscribe]