భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ ను భారత్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. డిసెంబర్ 11, బుధవారం నాడు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసి వెస్టిండీస్ జట్టుపై భారత్ 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత్ ఓపెనర్లు రోహిత్శర్మ(71), కేఎల్ రాహుల్(91) పరుగులతో వెస్టిండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వారిద్దరూ మొదటి వికెట్ కు 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ శర్మ అవుట్ అవ్వడంతో ఈసారి వన్డౌన్లో వచ్చిన రిషభ్ పంత్(0) పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి విధ్వంసం సృష్టించాడు. కేవలం 21 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్స్లు సహాయంతో అర్ధసెంచరీ పూర్తీ చేశాడు. కేఎల్ రాహుల్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో 22 పరుగులు, పోలార్డ్ వేసిన 19వ ఓవర్లో 27 పరుగుల సాధించి తన మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఇన్నింగ్ చివరి బంతి సిక్సుగా మలిచి 70 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ముగ్గురు కీలక ఆటగాళ్ల విజృంభణతో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 240 పరుగులు చేసి వెస్టిండీస్ కి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. విండీస్ బౌలర్లలో విలియమ్స్, కాట్రెల్, పొలార్డ్లు తలో వికెట్ దక్కించుకున్నారు.
టీ20 లలో భారీ లక్ష్యమైన 241 పరుగులను ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు ప్రారంభంలోనే ప్రధాన వికెట్లను కోల్పోయింది. నాలుగు ఓవర్లకే సిమన్స్(7), బ్రాండన్కింగ్(5), నికోలస్ పూరన్(0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే హెట్మైర్ (41), పొలార్డ్(68) భారత బౌలర్లపై ఎదురుదాడి చేసి మ్యాచ్ పై పట్టు సాధించడానికి ప్రయత్నించారు. వీరి పోరాటానికి మిగతా బ్యాట్స్ మెన్ నుంచి సహకారం అందలేదు. వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. కేఎల్ రాహుల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా, విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందజేశారు. ఈ మ్యాచ్ ద్వారా భారత ఆటగాళ్లు పలు రికార్డులను నమోదు చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్స్ అందుకున్న రెండో క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అలాగే టీ20 ఫార్మాట్లో స్వదేశంలో వెయ్యి పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్గా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు.