తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన డిసెంబర్ 11, బుధవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయింది. ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ముఖ్యంగా ఈ మంత్రివర్గ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నీటి పారుదల రంగం గురించి చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే శాఖలకు నిధుల కేటాయింపు, లోకాయుక్త చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నాబార్డ్ నుంచి 1500 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 14,075 కోట్ల రుణానికి ఆమోదం వంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా దుమ్ముగూడెం వద్ద 37 టిఎంసిల నీరు నిల్వ ఉండేలా బ్యారేజి, 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన ఏర్పాట్లుపై మంత్రులలో చర్చించి సీఎం కేసీఆర్ ఆమోదం తెలుపనున్నారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మరియు బడ్జెట్, కొత్త రెవెన్యూ చట్టం, ఇటీవల ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
[subscribe]