భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నవంబర్ 7, గురువారం నాడు రాజ్కోట్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఆదివారం నాడు జరిగిన మొదటి టీ20లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయాన్ని నమోదు సంగతి తెలిసిందే. మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలిచి సిరీస్ గెలుచుకోవాలని రోహిత్సేన పట్టుదలతో ఉంది. అదే విధంగా టీ20ల్లో భారత్పై మొదటిసారిగా గెలిచిన బంగ్లాదేశ్, ఇంకో మ్యాచ్ గెలిచి సిరీస్ను చేజిక్కుంచుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఈ టీ20పైనే ఉంది. మరో వైపు రాజ్కోట్ లో జరిగే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు కూడ ఉంది. గుజరాత్ లో మహా తుఫాను ప్రభావం వలన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ ప్రారంభమయ్యే 7 గంటలకు సమయానికి, అప్పటి పరిస్థితిని బట్టి మ్యాచ్ జరిపే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.
రెండో టీ20కి జట్టులో మార్పులుంటాయని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంకేతాలిచ్చారు. మొదటి టీ20లో భారతజట్టు ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. రాజ్కోట్ మైదానంలో జరిగే మ్యాచుల్లో దాదాపుగా ఎప్పుడూ భారీ స్కోర్లే నమోదవుతుంటాయి, పిచ్ బ్యాటింగ్ అనుకూలం ఉంటుంది. పేసర్లకు కూడా సహకరిస్తుంది. ఈ నేపథ్యంలో పిచ్ ను విశ్లేషించి తుది జట్టు కూర్పులో మార్పులు చేస్తామని రోహిత్ శర్మ వెల్లడించారు. శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే ఈ మ్యాచ్ లో రాణించడం ఏంతో కీలకం. భారీ స్కోరు సాధించడంలో విఫలమవుతున్న రిషబ్ పంత్, సంజు శాంసన్ నుంచి జట్టులో స్థానానికి పోటీ నెలకున్న క్రమంలో ఆశించిన మేరకు రాణించాల్సి ఉంది. మొదటి టీ20లో సరైన సమయంలో బౌలర్లు తడబడడంతో, ఈ మ్యాచ్ లో బౌలింగ్ విభాగంలో మార్పులు ఉండవచ్చు.