కోనా ఫిల్మ్ కార్పొరేషన్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ కథానాయిక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. ఇటీవల విడుదలైన సైరా నరసింహారెడ్డి చిత్రంలో అతిథి పాత్రలో కనిపించినప్పటికీ, భాగమతి సూపర్ హిట్ తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనుష్క చిత్రం ఇదే. ఇప్పటికే ఫస్ట్ లుక్, ప్రీ టీజర్ తో ఆసక్తి కలిగించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే నవంబర్ 7 గురువారం నాడు అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్ ‘నిశ్శబ్దం’ సినిమా టీజర్ ను విడుదల చేసింది. సినిమా మీద అంచనాలని మరింతగా పెంచేలా ఈ సినిమా టీజర్ ను రూపొందించారు. విహారయాత్రలో ఏర్పడ్డ పరిణామాలతో, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అనుష్క తన నటనతో మరోసారి సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంది.
తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని ఒకేసారిగా తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో లో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, ఇంగ్లీష్ లో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మాడ్సెన్, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంచి నిర్మాణ విలువలతో కోన వెంకట్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందిస్తున్న ఈ సినిమాకి షానైల్ డియో సినిమాటోగ్రఫీ, గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
[subscribe]