క్రైస్ట్చర్చ్ సిటీలోని హాగ్లీ ఓవల్ మైదానంలో భారత్ – న్యూజిలాండ్ మధ్య ఫిబ్రవరి 29, శనివారం నాడు రెండో టెస్టు మొదలైంది. ఈ టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 242 పరుగులకే ఆలౌట్ అయింది. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన భారత్ జట్టు ప్రారంభంలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (7) వికెట్ కోల్పోయింది. వన్డౌన్లో వచ్చిన పుజారా (54) మరో ఓపెనర్ పృథ్వీ షా తో కలిసి వికెట్లు పడకుండా ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. జట్టు స్కోర్ 80 వద్ద ఉండగా పృథ్వీ షా (54) కూడా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో లంచ్ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. లంచ్ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ(3), అజింక్య రహానే(7) పెవిలియన్ బాట పట్టారు. దీంతో హనుమ విహారితో కలిసి పుజారా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.
అనంతరం హనుమ విహారి(55) నీల్ వాగ్నెర్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో టీ విరామ సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఇక టీ విరామం తర్వాత భారత్ జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. జెమీసన్ వేసిన ఇన్నింగ్స్ 56, 58 ఓవర్లలో చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్(12), ఉమేష్ యాదవ్ (0) లు అవుట్ అయ్యారు. ఆతర్వాత రవీంద్ర జడేజా(9), మహమ్మద్ షమీ (16) కొద్దిసేపు పోరాటం చేసిన న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి నిలువలేక పోయారు. దీంతో 63 ఓవర్లలో 242 పరుగులకే భారత్ జట్టు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో జెమీసన్ 5 వికెట్లు పడగొట్టగా, సౌథీ 2 వికెట్లు, బౌల్ట్ 2 వికెట్లు, నీల్ వాగ్నెర్ ఒక వికెట్ తీశారు.