వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు టి-20ల సిరీస్ ను, వరుసగా రెండు విజయాలు సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారతజట్టు సొంతం చేసుకుంది. ఆదివారం నాడు వెస్టిండీస్ తో జరిగిన రెండో టి-20 మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించడం వలన భారత్ జట్టు డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 22 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారతజట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. రోహితశర్మ 67 పరుగులు చేసి ఆకట్టు కున్నాడు, శిఖర్ ధావన్ (23), కోహ్లీ (28), క్రునాల్ పాండ్యా (20) పరుగులు చేసారు.
తరువాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నరైన్(4) వికెట్ ఆరంభంలోనే కోల్పోయినా, రోమన్ పావెల్ 54 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, పురాన్ 19 పరుగులతో రాణించాడు. ఇన్నింగ్ చక్కదిద్దుతున్న రోమన్ పావెల్, పురాన్ వికెట్లను క్రునాల్ పాండ్యా ఒకే ఓవర్లో పడగొట్టి వెస్టిండీస్ ను దెబ్బతీశాడు. 15.3 ఓవర్లకి వెస్టిండీస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసిన తరుణంలో వర్షం వలన మ్యాచ్ కు అంతరాయం కలిగింది. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం వెస్టిండీస్ జట్టు అప్పటికి 120 పరుగులు చేసివుంటే గెలిచిఉండేది, వర్షం తగ్గక పోవడంతో 22 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టి-20 లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డ్ సాధించాడు. 105 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్న క్రిస్ గేల్ ను 107 సిక్సర్లతో రోహిత్ శర్మ అధిగమించాడు. మార్టిన్ గుప్తిల్ 103 సిక్సర్లుతో మూడో స్థానంలో ఉన్నారు.